ర్యాష్‌ డ్రైవింగ్‌పై వేటు పడింది

గచ్చిబౌలి: బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై సెల్ఫీ దిగుతుండగా.. మద్యం మత్తులో ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అభిలాష్‌ ర్యాష్‌ డైవింగ్‌ చేస్తూ ఇద్దరు యువకులను ఢీకొట్టడంతో వారు కిందపడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ర్యాష్‌ డ్రైవింగ్‌ చేశాడని నిర్ధారించిన రాయదుర్గం పోలీసులు ఐపీసీ 304(ఏ)337, 279, సెక్షన్‌లతో పాటు 185 ఆఫ్‌ ఎంవీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ఆల్కహాల్‌ 230ఎంజీ/100 ఎంఎల్‌గా ఉండటంతో కూకట్‌పల్లి ఆర్‌టీఏ అధికారులు 2019 నవంబర్‌ 15 నుంచి 2020 నవంబర్‌ 15 వరకు సంవత్సరం పాటు లైసెన్స్‌ రద్దు చేశారు.


గత నవంబర్‌ 10న అర్ధరాత్రి 1 గంట సమయంలో కూకట్‌పల్లి శాంతినగర్‌ నివాసి అభిలాష్‌ పెదకొట్ల మెహిదీపట్నంలో మద్యం తాగి స్నేహితుడితో కలిసి ఐ20 కారులో కూకట్‌పల్లికి బయలుదేరారు. అభిలాష్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై సెల్ఫీ దిగుతున్న సరూర్‌నగర్‌కు చెందిన పి.సాయి వంశీకృష్ణ (22), కిష్టాపూర్‌నకు చెందిన ఎన్‌.ప్రవీణ్‌ (22)లను ఢీకొట్టడంతో ఎగిరి కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టడంతో నలుగురు గాయాలపాలయ్యారు. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ ప్రారంభమైన 7 రోజులకే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.